Ratha Saptami : హిందువులు జరుపుకునే అనేక రకాల పండుగల్లో రథసప్తమి ఒకటి. దీన్ని కొందరు మాత్రమే జరుపుకుంటారు. కానీ వాస్తవానికి రథ సప్తమి రోజు సూర్య భగవానుడికి ప్రధానంగా పూజ చేయాలి. సమస్త ప్రాణికోటికి ఆయన వెలుగునిస్తాడు కనుక ఆ రోజు ఆయనను పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అనేక సమస్యలు ఉన్నవారు, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న వారు రథ సప్తమి రోజు పూజలు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.

ఇక రథ సప్తమిని మాఘ శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే సప్తమి తిథికి చాలా విశిష్టత ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున మకర సంక్రాతిని జరుపుకుంటారు. సూర్యుడి పుట్టిన రోజునే మనం రథ సప్తమిగా జరుపుకుంటాం. రథ సప్తమికి సూర్య జయంతి, మాఘ సప్తమి, అచల సప్తమి, సూర్య రథ సప్తమి అనే పేర్లు ఉన్నాయి. రథ సప్తమి రోజున సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు, ఏడు రకాల వ్యాధులు పోతాయని విశ్వసిస్తారు.
ఈ రోజున చేసే పూజలు, దానాల వల్ల ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే రథ సప్తమిని ఏ రోజున జరుపుకోవాలనే సందేహం కొందరిలో ఉంది. పంచాంగం ప్రకారం సప్తమి తిథి ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 7.35 గంటల నుండి ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 8.36 గంటల వరకు ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన సూర్యోదయానికి సప్తమి తిథి లేనందున 8వ తేదీన రథ సప్తమిని జరుపుకోవాలి. ఉదయం 6.35 నుండి 8.36 గంటల వరకు రథ సప్తమి పూజను చేసుకోవచ్చు.
రథ సప్తమి నాడు చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున ఏడు జిల్లేడు ఆకులను లేదా ఏడు రేగు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయాలి. దీంతో ఆ ఆకులలోని ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ఏడు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి దాన్ని సూర్య భగవానుడి రథంగా భావించాలి. సూర్య కిరణాలు పడే చోట పాలతో ఇత్తడి పాత్రలో పాయసం వండి, దానిని ఏడు చిక్కుడు ఆకులలో పెట్టి, సూర్య భగవానుడికి నైవేద్యం సమర్పించాలి. దాని పక్కన ఏడు పద్మాలతో రథం ముగ్గు వేసి అందులో సూర్యుడి ప్రతిమను గీసి పూజను చేసుకోవాలి. ఆదిత్య హృదయం, సూర్య మండల స్తోత్రం, సూర్యాష్టకం వంటి స్తోత్రాలను చదువుకోవాలి. చిక్కుడు ఆకులలో పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
ఇలా రథ సప్తమి నాడు సూర్య భగవానుడికి పూజలు చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.