Charmy Kaur : ఇటీవల భారీ అంచనాల నడుమ స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వడం, చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతోన్నారు. మెగాస్టార్ ఆచార్య సినిమా విషయంలోనూ డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇక అందరూ కట్టకట్టుకుని కొరటాల శివ ఆఫీస్ ఎదుటకు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అలా రచ్చ చేయడంతో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు కొరటాల శివ కొంత మొత్తాన్ని తిరిగిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు పూరీ జగన్నాథ్ లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో భారీగా నష్టపోయారట. వీరంతా కూడా ఛార్మీ, పూరీలను కలిసి తమ నష్టాలను ఎంతో కొంత పూడ్చమని అడిగేందుకు ప్రయత్నిస్తున్నారట. కానీ ఛార్మీ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదట. మేం కూడా చాలా నష్టపోయాం. అలాంటప్పుడు మీకెక్కడి నుంచి ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతుందట. అయితే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి కనీసం ఛార్మీతో మాట్లాడేందుకు కూడా లైన్ దొరకడం లేదట.

దీంతో వారంతా కూడా ఈ ఇష్యూని ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే తమకు రావాల్సిన మొత్తాన్ని, వడ్డీలను చెల్లించిన తరువాతే నెక్ట్స్ సినిమాను తీసుకోండనే ఒత్తిడిని తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి వీరి ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అయితే కొన్ని రోజుల క్రితం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తిరిగి ఇచ్చిన మొత్తం మీద రకరకాల వార్తలు వచ్చాయి. లైగర్ సినిమాకి నష్టాలు రావడంతో.. పూరీ, ఛార్మీలకు విజయ్ రూ.6 కోట్లు తిరిగి ఇచ్చాడని సమాచారం.