Akhil Akkineni : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నేడు విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పక్కా హిట్ అవుతుందనే ఆలోచనలో టీం ఉంది. గత కొద్ది రోజులుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న అఖిల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఫోన్లో అక్కినేని ఫొటో స్క్రీన్పై ఎప్పుడూ ఉంటుందని తెలియజేశాడు.
ఇక తాజాగా ఓ వ్యక్తి పేరుని గాడ్ ఫాదర్గా సేవ్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి అల్లు అరవింద్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. ఆయన చూపించిన ప్రేమానురాగాలను మరిచిపోలేను. నాకు తప్పకుండా హిట్ ఇవ్వాలనే ఒక తపనతో బన్నీ వాసుతో కలిసి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫోన్ లో ఆయన నంబర్ ను ‘గాడ్ ఫాదర్’ అనే పేరుతోనే ఫీడ్ చేసుకున్నాను.. అని అఖిల్ పేర్కొన్నాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించింది. ప్రేమలో ఉన్నప్పుడు మనసు ఏది ఆశపడుతుంది ? పెళ్లి తరువాత మనసు ఏం ఆశిస్తుం ది? అనే ఇంట్రెస్టింగ్ లైన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాగానే ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి.