ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా, దూరంగా ఉన్న వస్తువులను అస్పష్టంగా కనిపించడమే సమస్య అని.. దీనినే మియోపియా అని అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మంది పిల్లలకు వస్తుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంట్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు పెరగడంతో గంటలకొద్దీ మొబైల్స్, కంప్యూటర్ల ముందు క్లాసులు జరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కోవిడ్ కంటే ముందు ఇప్పుడు ఈ సమస్య రెట్టింపు అయిందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, మెల్ల కన్ను, కళ్ళ కలక వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
దీంతో పిల్లలు చిన్న వయసులోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాబట్టి డిజిటల్ స్క్రీన్ ల ముందు ఎక్కువ సమయాన్ని గడపనివ్వవద్దని సలహాలు ఇస్తున్నారు. ఇక విరామం లేకుండా గంటల కొద్దీ కూర్చోవద్దని, స్క్రీన్ ముందు కనీసం 33 సెంటీ మీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.