Upasana : భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రెండో సినిమా చేసింది. ప్రస్తుతం తను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే బీటౌన్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తను కొంతకాలంగా ప్రేమలో ఉండగా, ఎట్టకేలకి ఈ లవ్ బర్డ్స్ వివాహం మంగళవారం సాయంత్రం రాజస్థాన్లోని సూర్యఘడ్ కోటలో సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అఫిషియల్గా షేర్ చేసింది కియారా. ఈ సందర్భంగా రామ్ చరణ్ సిద్ధార్థ్, కియారా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందనే కోట్తో పాటు వారిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న ఫొటోను జతచేస్తూ పోస్ట్ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశాడు రామ్ చరణ్. ఇక చరణ్ సతీమణి ఉపాసన… కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ వివాహ ఆల్బమ్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ..‘అభినందనలు. మీ జంట చాలా అందంగా ఉంది. మేము హాజరుకానందుకు క్షమించండి. మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ మా ప్రేమ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్, ఉపాసన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు వందకు పైగా వీవీఐపీలను ఇన్వైట్ చేసినట్లు సమాచారం. అలాగే తెలుగులో తనతో కలిసి పనిచేసిన ఇద్దరు నటులు రామ్ చరణ్, మహేష్ బాబులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. కియారా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15వ సినిమాలో నటిస్తోంది. ఇది రామ్ చరణ్తో తనకు రెండో సినిమా. ఈ మూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగానే వాయిదా పడింది. ఇక సిద్, కియారా వివాహ వేడుకలన్నీ ముగిసిన తర్వాత రూ. 70 కోట్ల విలువైన తమ కొత్త జుహూ మాన్షన్కి మారనున్నారు.