సాధారణంగా హిందూ మహిళలు ఏదైనా ఆలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి, తలలో పువ్వులు పెట్టుకుని, నుదిటి పై కుంకుమ దిద్ది ఆలయానికి నిండు ముత్తయిదువుల వెళ్లి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారు. సాధారణంగా అన్ని ఆలయాలకు వెళ్లే మహిళలు ఈ విధంగా తలలో పువ్వులు పెట్టుకుని ఆలయానికి వెల్లడం మనం చూస్తుంటాము. కానీ కలియుగ దైవంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాంటి పరిస్థితులలో కూడా తలలో పువ్వులు పెట్టుకోరు. అయితే తిరుమలకు వెళ్లే భక్తులు పువ్వులు ఎందుకు పెట్టుకోరు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా శివునికి అభిషేక ప్రియుడిని, విష్ణువుని అలంకార ప్రియుడు చెబుతాము. అదేవిధంగా శ్రీ హరి పుష్ప అలంకార ప్రియుడని చెబుతారు. పురాణాల ప్రకారం శ్రీరంగం భోగమండపం అయితే కంచి త్యాగ మండపం అవుతుంది. అదేవిధంగా తిరుమల పుష్ప మండపం అని పురాణాలు చెబుతున్నాయి.
తిరుమల పుష్ప మండపం కావటంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కొన్ని వందల రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. అందుకే తిరుమలలో పూసిన ప్రతి ఒక్క పువ్వు స్వామి కోసమే పూస్తుందని అక్కడి ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.అందుకోసమే తిరుమలకు స్వామివారి దర్శనానికి వెళ్లే వారు పూలు పెట్టుకోకుండా వెళ్ళాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధన. పొరపాటున ఎవరైనా పూలు పెట్టుకుని వెళ్తే చెక్ పోస్టులలో, క్యూలైన్లలో పువ్వులను తీయించి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.