హిందూ పురాణాల ప్రకారం లోక సంరక్షణార్ధం విష్ణుమూర్తి దశావతారాలను ఎత్తి పాప సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడని మనకు తెలిసిందే. ఈ విధంగా విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించడం వల్ల ఆ రోజున భక్తులందరూ కృష్ణాష్టమిని వేడుకగా, కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం, వాసుకికి ఎనిమిదవ సంతానంగా, అష్టమి రోజు అంటే కృష్ణపక్షంలో ఎనిమిదవ రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు.
ఈ విధంగా కృష్ణుడు అష్టమి రోజు జన్మించడం వల్ల ఈ రోజున కృష్ణాష్టమి వేడుకలుగా పెద్దఎత్తున జరుపుకుంటారు. కృష్ణాష్టమి వేడుకలను ఏవిధంగా జరుపుకోవాలి ? భక్తులు ఎలాంటి నియమాలను పాటించాలి ? అనే విషయానికి వస్తే.. కృష్ణాష్టమి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కృష్ణుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఈ మాసంలో లభించే ప్రత్యేకమైన పండ్లను, వెన్నను, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
మన జీవితంలో మనం చేసిన సకల పాపాలు తొలగిపోవాలంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజించాలి. కృష్ణాష్టమి రోజు ఆవుకు గడ్డి వేసి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోమాతకు నమస్కారం చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా సంతానం లేని వారు బాలకృష్ణుడిని గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయడం వల్ల వివాహం త్వరగా జరుగుతుంది. ఇకపోతే శ్రీ కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం కనుక కృష్ణాష్టమి రోజు ఉట్టికట్టి, ఉట్టి కొట్టే వేడుకలో పాల్గొంటారు. ఈ విధంగా కృష్ణాష్టమి రోజు భక్తులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.