మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతి నెలా మనకు రెండు ఏకాదశి తిధులు వస్తాయి. అందులో ఒకటి శుక్లపక్షంలో రాగా, మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో కెల్లా అత్యంత ముఖ్యమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి జేష్ట మాస శుక్ల పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఎంతో నియమ నిష్టలతో విష్ణు దేవుడికి పూజ చేయటం వల్ల మిగిలిన 23 ఏకాదశలకు పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
జేష్ట మాస శుక్ల ఏకాదశి రోజు వచ్చే ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైనది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి గంగాజలంతో విష్ణు ప్రతిమకు అభిషేకం చేయాలి. అదేవిధంగా విష్ణు దేవుడికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పుష్పాలతో పాటు తులసి మాలలను కూడా సమర్పించాలి. అయితే ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసంతో పూజ చేయాలి. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకూడదు.
ఈ ఏకాదశి బ్రహ్మ ముహూర్తంలో మొదలై అమృత కాలంలో ముగిస్తుంది. ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం విష్ణు సహస్రనామాలను పఠించాలి.అలాగే స్వామివారికి సాత్విక నైవేద్యం సమర్పించడంతో స్వామి వారు ఎంతో ప్రీతి చెంది మనం కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసీదళాలతో ఉండేలా చూసుకోవాలి. తులసీ దళాలు లేనిది స్వామి వారి పూజ పూర్తి కాదు.ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు కేవలం స్వామి వారికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.