శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఒక ఆలయంగా మారుతుంది. ప్రతి ఇంటిలోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. వివిధ రకాల నోములు, వ్రతాలతో మహిళలు ఎంతో బిజీగా ఉంటారు. అదే విధంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మరి రాఖీ కట్టేటప్పుడు ఏ సమయంలో కట్టాలి, రాఖీ కట్టే సమయంలో ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా.
అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు సోదరి తన సోదరుడికి ఎప్పుడూ కూడా యమగండం, రాహుకాలంలో రాఖీ కట్టకూడదు. శుభ ముహూర్తంలోనే రాఖీ కట్టాలి. అదేవిధంగా రాఖీ కట్టడం కోసం మనం కొన్ని రకాల వస్తువులను సిద్ధం చేసుకుంటాం. ముఖ్యంగా రాఖీ కట్టే సమయంలో ఎలాంటి వస్తువులు ఉండాలి అనే విషయానికి వస్తే..
సోదరుడికి రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ దీర్ఘాయుష్షుకు అదృష్టానికి ప్రతీక. అదేవిధంగా అక్షింతలు. అక్షతం అంటే పరాజయం లేనిది అని అర్థం. అందుకోసమే అక్షింతలు సోదరుడిపై వేయడం వల్ల అతని జీవితంలో ఎలాంటి పరాజయం లేకుండా విజయాలతో దూసుకుపోతాడని అర్థం. కొబ్బరికాయను శ్రీ ఫలం అని కూడా పిలుస్తాం. రాఖీ కట్టే సమయంలో సోదరుడికి కొబ్బరికాయ ఇస్తారు. ఇది అతడి అభివృద్ధికి సూచిక. అదేవిధంగా మిఠాయిలు కూడా తప్పనిసరిగా ఉండాలి. రాఖీ కట్టే సమయంలో సోదరి తన సోదరుడికి మిఠాయి తినిపించడం వల్ల వారిద్దరి మధ్య సంబంధం ఎలాంటి కలహాలు లేకుండా తియ్యగా ఉంటుందని చెబుతారు. కనుక రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా ఈ వస్తువులు ఉండాలి.