భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ విధంగా గొడవలు తలెత్తినప్పుడు క్షణికావేశంలో భార్య భర్తను చంపడం లేదా భర్త భార్యని చంపడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనల గురించి మనం చదివాం. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
జగదీష్, సుచిత్ర అనే దంపతులు ఫిలింనగర్ లో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. తరచూ ఈ దంపతుల మధ్య గొడవలు తలెత్తడంతో పోట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే గత రెండు నెలల క్రితం జగదీశ్, సుచిత్ర మధ్య వివాదం చోటుచేసుకోవడంతో సుచిత్ర క్షణికావేశంలో తన భర్త జగదీష్ ను చున్నీతో ఉరివేసి చంపి తన భర్త గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో జగదీష్ మరణించాడని భావించిన కుటుంబసభ్యులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు.
జగదీష్ చనిపోయిన రెండు నెలల తర్వాత అతని కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో జగదీష్ మరణం గురించి అతని 11 సంవత్సరాల కొడుకును ఆరా తీశారు. ఈ క్రమంలోనే అతని కొడుకు తన తండ్రిని తన తల్లి చున్నీతో ఉరివేసి చంపినట్లు జగదీష్ సోదరుడికి చెప్పాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు జగదీశ్ కొడుకు సాక్ష్యంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.