హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్రపై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్రంగా కలకలం రేపింది. ఈ క్రమంలోనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అతనిని ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.
గత వారం రోజుల నుంచి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న రాజు ఎట్టకేలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘటన సంచలనం కలిగిస్తోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమ కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారి చైత్రకు న్యాయం జరగాలంటూ పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి చైత్ర మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
https://twitter.com/KChiruTweets/status/1438402597002440704
ఇక ప్రస్తుతం రాజు మృతి చెందాడు అనే విషయం తెలియడంతో అతని మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో చిరు స్పందిస్తూ.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు తనకు తానే శిక్షించుకోవడంతో బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగింది. ఈ సంఘటనపై ప్రజలు, మీడియా పెద్ద ఎత్తున స్పందించాయి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. అలాంటి వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ఆ చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ.. మెగాస్టార్ ట్వీట్ చేశారు.