ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత కొందరికి తన తల్లి భారంగా మారుతుంది. ఇలా ఓ కొడుకు జులాయిగా తిరుగుతూ తన తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణం చేత ఆమె మెడకు కరెంటు వైరును బిగించి చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ పరిగి మండలం కుదావంద్ పూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానికంగా ఉన్న భీమమ్మ, ఆమె కొడుకు బలవంత్ లు తమకున్న కొంత పొలంతో జీవనం సాగించేవారు. అయితే భీమమ్మ కొడుకు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తన తల్లి పెన్షన్, రైతుబంధు డబ్బులను లాక్కొని మద్యం సేవిస్తూ జులాయి తిరుగుళ్ళు తిరిగే వాడు. తన కొడుకు ఈ విధంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి.
ఒకరోజు తనకు డబ్బులు కావాలని తన తల్లిని ఎంతో ఒత్తిడికి గురి చేసిన బలవంత్ తన తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది. తన తల్లి లేకపోతే ఆమె పేరుపై ఉన్న పొలం తన సొంత అవుతుంది, దానికి వచ్చే డబ్బులు కూడా తనకే దక్కుతాయని భావించి తన తల్లి మెడకు కరెంటు వైర్ బిగించి చంపాడు. ఇలా దారుణానికి పాల్పడి ఏమీ ఎరగనట్టు ఉండడంతో ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. బలవంత్ను అరెస్టు చేశారు.