మన పూర్వీకుల కాలం నుంచి భర్త చనిపోయిన తర్వాత భార్యను వితంతువుగా చేసే ఆచారం వస్తోంది. ఈ సమయంలోనే సుమంగళిగా ఉన్న స్త్రీకి నుదుటిన బొట్టు, పసుపు, కుంకుమ మెడలో మాంగళ్యం, కాలి మెట్టెలను, పువ్వులను దూరం చేస్తారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఈ వస్తువులను భార్య అలంకరించుకోకూడదని చెబుతారు. అయితే నిజంగానే భర్త చనిపోయిన తర్వాత మహిళ నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదా ? శాస్త్రం ఏం చెబుతుంది ? అనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం.. భర్త చనిపోయిన తర్వాత మహిళ నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదన్న నియమం ఎక్కడా లేదు. భర్త చనిపోయిన తర్వాత మహిళ నిరభ్యంతరంగా నుదుటిపై బొట్టు పెట్టుకోవచ్చు. అయితే ఒక స్త్రీ పెళ్లికాకముందు నుంచి.. అంటే.. జన్మించినప్పటి నుంచి నుదుటిపై బొట్టు పెట్టుకొని ఉంటుంది. కానీ భర్త మరణించిన తర్వాత ఆ బొట్టుని తొలగించాలని ఏ శాస్త్రంలోనూ లేదు. అయితే పెళ్లయిన మహిళకు నుదుటిపై కాకుండా మాంగళ్య ధారణ జరిగిన తర్వాత పాపిడిపై బొట్టు వస్తుంది. కనుక వితంతువు అయ్యాక పాపిడిపై బొట్టును ధరించరాదు. కానీ నుదుటిపై బొట్టును ధరించవచ్చు.
వివాహం తర్వాత ఒక స్త్రీకి పాపిడిలో సింధూరం పెట్టుకునే అర్హత వస్తుంది కనుక.. భర్త చనిపోయిన తర్వాత అతని ద్వారా వచ్చిన పాపిడి బొట్టును తొలగించాలి కానీ నుదుటిపై ఉన్న బొట్టును తొలగించాలని, నుదుటిపై బొట్టు పెట్టుకోకూడదని.. మనకు ఏ శాస్త్రం చెప్పడంలేదు. ఒక స్త్రీ జీవితంలోకి భర్త వచ్చిన తర్వాత తన జీవితంలోకి వచ్చే మాంగళ్యం, మెట్టెలను, పాపిడి బొట్టును తొలగించాలి తప్ప.. నుదుటిపై బొట్టును నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు.. అని పండితులు తెలియజేస్తున్నారు. నుదుటిపై ఉండే బొట్టు స్థానం సాక్షాత్తూ అమ్మవారి స్థానం. అక్కడ బొట్టును పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నుదుటిపై ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాల్సిందే. దీనికి ఎలాంటి షరతులు, నిబంధనలు లేవు. కనుక ఎవరైనా సరే నుదుటిపై బొట్టును పెట్టుకోవచ్చు.