భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సహజమే. అయితే ఆ గొడవలు కొంత సమయం అయితే సద్దు మణిగిపోతాయి. తర్వాత దంపతులు ఎప్పటిలాగే కలసి మెలసి ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అంతటితో శాంతించలేదు. భార్యతో గొడవపడి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై ఆమెను అతి దారుణంగా హత్య చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన కాంతరాజు (39) అనే వ్యక్తి స్థానికంగా ఫైనాన్షియర్గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి రూప (34) అనే భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వీరు పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో దంపతులిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంతరాజు ఆవేశం పట్టలేక పక్కనే ఉన్న ఓ ఐరన్ రాడ్ తీసుకుని ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో ఆమె కింద పడిపోయింది.
ఆ తరువాత కాంతరాజు తన భార్య రూప మెడపై అతి కిరాతకంగా స్క్రూ డ్రైవర్, కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కాంతరాజు తండ్రి, సోదరుడు రూప హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి కాంతరాజును అరెస్టు చేశారు. అయితే కాంత రాజుకు ఇప్పటికే 3 హత్యలతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాత కేసులను కూడా విచారిస్తున్నామని వారు తెలిపారు.