రాజస్థాన్లోని జోధ్ పూర్లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తానని అడిగినందుకు ఆగ్రహించిన భర్త తన భార్యను దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ముక్కు కోసేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జోధ్ పూర్ పరిధిలో ఉన్న లునావస్ అనే గ్రామంలో భూమా రామ్, దేవి (25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి దేవి తన పుట్టింటికి వెళ్లి వస్తానని తన భర్తను అడుగుతూ వస్తోంది. అందుకు అతను కూడా మొదట అంగీకారం తెలిపాడు. కానీ తాజాగా ఏమైందో తెలియదు కానీ.. తన భార్య పుట్టింటికి వెళ్లి వస్తానని అడిగితే వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఇద్దరి మధ్య ముందుగా మాటల యుద్ధం జరిగింది. అయితే చివరకు ఆవేశం పట్టలేని భూమా రామ్ తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకుని తన భార్య ముక్కు కోశాడు. ఈ విషయం గమనించిన ఇరుగు పొరుగు వారు దేవిని హాస్పిటల్కు తరలించారు. దేవి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భూమా రామ్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.