ఒడిశాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని ఓ మహిళను తన అత్తింటి కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. ఆమెను నగ్నంగా చేసి చిత్ర హింసలు పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా కొరుక్ గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహిళను అత్తింటి వారు కట్నం ఇవ్వలేదని చితకబాదారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు కట్నం ఇచ్చుకోలేమని చెప్పారు. దీంతో ఆమెను ఆమె భర్త సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, కొందరు పురుషులు నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. కర్రలతో చావబాదారు. ఈ క్రమంలో తీసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ మహిళపై అంతటి ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసే పనిలో ఉన్నారు.
అయితే ఆ మహిళను కొందరు గ్రామస్థులు, ఇతర మహిళలు రక్షించే ప్రయత్నం చేశారు. ఆమెకు దుస్తులు ఇచ్చేందుకు యత్నించారు. కానీ వారిని కూడా పక్కకు నెట్టేసి వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో సంఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.