ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కొందరు రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టమని, అలాంటి వారికి గుప్త నిధులు దొరుకుతాయని ఓ ముఠా తమ వద్ద ఉన్న ఓ రెండు తలల పామును అమ్మకానికి పెట్టారు.
అయితే విషయం తెలిసిన విజిలెన్స్ అధికారులు డీఎఫ్ఓ సుధాకర్రెడ్డి నేతృత్వంలో దాడిచేసి.. ఈసీఐఎల్ సమీపంలోని నగరంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వి.ఆంజనేయప్రసాద్ అనే ముఠా గ్యాంగ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తలలు కలిగి 4.30 కేజీల బరువు ఉన్న ఈ పామును ఏకంగా రూ.70 లక్షలకు అమ్మకానికి పెట్టారు.
కాగా నిందితుల నుంచి పోలీసులు కారు, టూవీలర్, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా రెండు తలలు కలిగిన పామును “రెడ్ సాండ్ బోవా” అంటారని దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం తప్ప ఏ విధమైన అదృష్టం కలగదని అధికారులు తెలియజేశారు. ఈ విధంగా పామును అమ్మకానికి పెట్టిన ముఠాను అరెస్టు చేయడంతో అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ అభినందించారు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే అమాయకులను గుర్తించి కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు.