హైదరాబాద్లోని హయత్ నగర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మృతదేహాన్ని భర్త ఒక దుప్పట్లో చుట్టి సమీపంలో ఉన్న బాతుల చెరువు అలుగు వద్ద పడేయటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హయత్నగర్ పాత రోడ్డుకు సమీపాన హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీను, అతని స్నేహితుడు వినోద్ కలిసి తన భార్య లక్ష్మి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సమీపంలోని చెరువు వద్ద పడవేయడాన్ని స్థానికులు గమనించారు.
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అక్కడ పడేయటానికి కారణం ఏంటని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతుందని, అనారోగ్యం కారణంగానే తన భార్య మృతి చెందడంతో దహన సంస్కారాలు నిర్వహించడానికి డబ్బులు లేక ఇలా చేశానని చెప్పాడు. అయితే పోలీసులు అతని ఇంటిని పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అనారోగ్యం కారణంగానే మృతి చెందిందా లేక మరేదైనా జరిగిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.