గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచంపై తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బారినపడి మృతి చెందారు. మరికొందరు కరోనా భయం పట్టుకొని మృతి చెందారు. తాజాగా ఓ జంట తమకు కరోనా సోకిందేమోనని భయపడింది. దీంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళూరు పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంగళూరులోని చిత్రపుర ప్రాంతానికి చెందిన గుణ సువర్ణ, రమేష్ కుమార్ అనే దంపతులు గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సువర్ణకు డయాబెటిస్ ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగినప్పటికీ ఇప్పటి వరకు వీరికి సంతానం కలగలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు వేధిస్తుంటే బతకాలనే ఆశ వీరిలో ఉన్నా కానీ కరోనా చంపేస్తుందన్న భయంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే కరోనా భయంతో తాము చనిపోతున్నామని సూసైడ్ లెటర్ రాసి ఆ లెటర్ పక్కనే లక్ష రూపాయలు ఉంచి ఆ లక్ష రూపాయలతో తమ అంత్యక్రియలు నిర్వహించాలని రాశారు. అలాగే మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ కు ఇదే విషయాన్ని వాయిస్ మెసేజ్ చేశారు. అయితే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేలోపే వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని మంగళూరు సిటీ కమిషనర్ తెలియజేశారు.