మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఓ తమ్ముడు తన అక్కను అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేశాడు. చిత్రమేమిటంటే.. ఇందుకు వారి తల్లి కూడా ప్రోత్సహించింది. ఆమె, అతను కలిసి ఆ యువతిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న వైజాపూర్ తహసీల్ గోయ్గావ్ అనే గ్రామానికి చెందిన కీర్తి థోరె (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారు ఒప్పుకోలేదు. దీంతో వారు ఇళ్ల నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకుని సొంతంగా జీవిస్తున్నారు.
అయితే కీర్తి థోరె తమ్ముడు (17), తల్లి ఇద్దరూ కలిసి మరాఠీ మూవీ సైరట్ను చూసి ప్రేరణ పొందారు. అందులో హీరోయిన్కు నచ్చజెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఉన్న చోటుకు వెళ్తారు. చివరకు ఆమెను అతి దారుణంగా నరికి చంపుతారు. సినిమాల్లో చివరి సీన్ అదే. దీంతో కీర్తి థోరె తమ్ముడు, తల్లి కూడా ఆ సీన్ను ప్రేరణగా తీసుకున్నారు. కీర్తిని చంపాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కీర్తి ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పారు. ఆమె పెళ్లిని తాము ఆమోదిస్తున్నామని, గతంలో జరిగినవన్నీ మరిచిపోయి అందరం సంతోషంగా ఉందామని నమ్మబలికారు. దీంతో ఆమె నిజమేనని నమ్మింది. తరువాత టీ పెట్టి తెస్తానని చెప్పి ఇంట్లో కిచెన్లోకి వెళ్లింది. అయితే ఆమె తమ్ముడు ఇంటి డోర్ పెట్టి కిచెన్లో ఆమె వెనుకగా వెళ్లాడు.
ఈ క్రమంలోనే కీర్తి కాళ్లను పట్టుకున్న ఆమె తల్లి ఆమెను వెనక్కి లాగి కింద పడేసింది. ఆపై కీర్తిని అదిమిపట్టుకుంది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడు ఆమె తలను నరికి వేరు చేశాడు. అనంతరం ఆమె తలతో ఇద్దరూ సెల్ఫీలు సైతం దిగారు. చుట్టు పక్కల ఉన్నవారికి ఆ తలను చూపించారు. అయితే అదే సమయానికి కీర్తి భర్త వచ్చాడు. కీర్తి తమ్ముడు అతన్ని కూడా చంపబోయాడు. కానీ అతను తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా వారు సైరట్ సినిమాను చూసి ప్రేరణ పొంది ఆ హత్య చేసినట్లు తెలిపారు.