సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల విరామం తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుత హీరోలకు దీటుగా సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదిలా ఉండగా చిరు తన తరువాత చిత్రాన్ని మలయాళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తూ “గాడ్ ఫాదర్” అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో అజిత్ నటించిన అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రం కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన “యెన్నై అరిందాల్” అని సినిమాను చూసిన మెగాస్టార్ ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తుండగా దర్శకుడి కోసం చిరంజీవి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ యువతిని క్రిమినల్స్ బారినుంచి కాపాడే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్లు సమాచారం.