ఈ ప్రపంచానికి సకల ధర్మాలను తెలియజేసే భగవద్గీతను అందజేసిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తులు కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణాష్టమిని శ్రావణమాసం శుక్లపక్ష అష్టమి తిథి రోజు జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమిని శ్రీ కృష్ణ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా హిందూ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. మరి శ్రీ కృష్ణాష్టమి రోజు భక్తులు ఏం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
కృష్ణాష్టమి రోజు వేకువ జామునే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని పూజకు ఇంటిని మొత్తం అలంకరించుకోవాలి. అలాగే శ్రీకృష్ణుడి పాదాలను వేసి శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజించాలి. కృష్ణుడి విగ్రహం ముందు ఐదు వత్తులతో దీపారాధన చేసి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. కృష్ణాష్టమి రోజు స్వామి వారిని మూడు రకాలుగా ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయంలో కృష్ణుడికి పూజలు చేస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసముండి ఆ రోజు రాత్రికి కృష్ణుడి కథలు, ఆయన లీలలు వింటూ జాగరణ చేయాలి. అదేవిధంగా అష్టోత్తరం, శ్రీ కృష్ణ సహస్ర నామాలు, భాగవతంలోని దశమ స్కంధం చదువుతూ జాగరణ చేసి మరుసటి రోజు ఉపవాసం విరమించుకోవాలి. అలాగే మరికొందరు మహిళలు తమ చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి పూజించడం ద్వారా అన్ని శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.