కొత్త వాహనం కొనాలనుకునే వారికి మద్రాస్ హైకోర్టు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ ఇన్సూరెన్స్ కారణంగా సెప్టెంబర్ 1 నుంచి వాహనాలపై అయిదేళ్ల భీమా తప్పనిసరి కానుంది. ఈ క్రమంలోనే వాహనాలపై 10 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు టూ వీలర్స్ పై సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర పెరగడమే కాకుండా, ఎంట్రీ లెవల్ కార్ల కొనుగోలుపై రూ.50,000, ఎస్యూవీ కార్ల పై రూ.2 లక్షల వరకు భారం పడుతుందని ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి వెల్లడించారు. సాధారణంగా లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేసేటప్పుడు ప్రీమియం భారం తగ్గించడానికి చాలా మంది ఎన్నో పథకాలు వేస్తారు. అలాంటి సమయంలో బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ చేయటం వల్ల కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఉన్న వ్యక్తులకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు కారణంగా ఒక వాహనంపై 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచడంవల్ల మార్కెట్ వాల్యూ తగ్గుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం దాదాపుగా 3 శాతం వరకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే వాహన ధరలు కూడా పెరిగిపోతాయి. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ పరిశ్రమపై మద్రాస్ హైకోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.