దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.330 డెబిట్ అవుతున్నాయి. వారికి ఆ మొత్తం డెబిట్ అయినట్లు మెసేజ్లు, మెయిల్స్ వస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతా నుంచి రూ.330 ఎందుకు డెబిట్ అవుతున్నాయో చాలా మందికి తెలియడం లేదు.
2015వ సంవత్సరం మే 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏడాదికి రూ.330 చెల్లిస్తే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇన్సూర్ అయిన వ్యక్తి ఏవిధంగా అయినా సరే చనిపోతే అతని నామినీకి రూ.2 లక్షలు వస్తాయి. బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఆటో డెబిట్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించారు. అందుకనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాల నుంచి డెబిట్ అవుతోంది.
అయితే కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అలాంటి వారికి ఒకటి కన్నా ఎక్కువ ఖాతాల్లో ఆ మొత్తం డెబిట్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వారితోపాటు ఈ పథకం వద్దనుకునేవారు తమ బ్యాంకు బ్రాంచిని సంప్రదించి ఈ పథకం నుంచి తొలగిపోతున్నట్లు లేఖ ఇవ్వాలి. దీంతో డెబిట్ అయిన ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రీఫండ్ చేస్తారు.
ప్రతి ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ పథకానికి ప్రీమియం రూ.330 డెబిట్ అవుతాయి. అదే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పథకంలో దరఖాస్తు చేసుకుంటే రూ.258, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో దరఖాస్తు చేస్తే రూ.170, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దరఖాస్తు చేస్తే రూ.86 ప్రీమియం చెల్లించాలి. ఏడాది పూర్తి ప్రీమియం రూ.330 చెల్లించాలి.