మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం కాలేదని.. పాన్ కార్డ్ – ఆధార్ అనుసంధానానికి గడువు ముగుస్తుందని టెన్షన్ పడుతున్నారా.. అయితే ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు – ఆధార్ అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీని ఆఖరి తేదీ ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్నటువంటి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు ఇస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు – ఆధార్ లింక్ తప్పని సరని తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు – ఆధార్ ను అనుసంధానం చేయడానికి ఎన్నోసార్లు గడువును పొడిగించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఈ గడువును మరో ఆరు నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రజలందరికీ ఎంతో ఊరట కలిగింది.