శ్రీలంక టూర్లో భాగంగా ఆ జట్టుతో కొలంబోలో ఆదివారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్మన్లలో చమిక కరుణరత్నె (43 పరుగులు), దసున్ శనక (39), చరిత్ అసలంక (38)లు ఫర్వాలేదనిపించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లకు తలా 2 వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ కేవలం 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్మెన్ పరుగులను పిండుకున్నారు. దీంతో 36.4 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయిన భారత్ 263 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాట్స్మెన్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగుల నాటౌట్ స్కోరుతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అలాగే ఇషాన్ కిషన్ (59), పృథ్వీ షా (43)లు కూడా రాణించారు. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వకు 2, లక్షన్ సందకన్కు 1 వికెట్ దక్కాయి. ఇక ఈ సిరీస్లో రెండో వన్డే ఈ నెల 20న ఇదే స్టేడియంలో జరగనుంది.