ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సోదరి సోదరుడు వారి మధ్య ఉన్న బంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోదరుడికి సోదరి రాఖీ కట్టగా సోదరుడు తన సోదరికి ఎంతో విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ హర్యానాలో మాత్రం తమ్ముడు తన అక్కకు రాఖీ పండుగ కానుకగా ఏకంగా తన కిడ్నీని బహుమతిగా ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని రోహ్తక్కు చెందిన ఓ మహిళ గత ఐదు సంవత్సరాల కాలం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆమెకు హైబీపీ ఉన్న కారణంగా ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెలియజేశారు. దీంతో ఆమెకు కిడ్నీ దానం చేసే దాత కోసం ఎదురు చూశారు.
తమ కుటుంబ సభ్యులే తనకు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా తన భర్త కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడంతో అతన్ని పరీక్షించారు. అతనిది వేరే బ్లడ్ గ్రూప్ వేరే కావడంచేత అతని కిడ్నీ సరిపోలేదు. ఈ క్రమంలోనే తన తమ్ముడి కిడ్నీ అక్కకు సరి పోవడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన అక్కకు కిడ్నీని దానం చేశాడు. సుమారు ఐదు గంటల పాటు శస్త్ర చికిత్స చేయగా ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ క్రమంలోనే తన అక్క ప్రాణాలను కాపాడటం కోసం తమ్ముడు ఇచ్చిన బహుమతిని చూసి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. రక్షాబంధన్ అంటే నిజమైన అర్థం ఇదే కదా.. అని అభినందిస్తున్నారు.