కొత్తగా పెళ్లయిన వారికి తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సహజంగానే గిఫ్ట్లను పంపిస్తుంటారు. ఎక్కువగా వారి కొత్త ఇంటికి పనికొచ్చే బహుమతులను అందజేస్తుంటారు. అయితే ఆ తండ్రి మాత్రం తన కుమార్తెకు అనుకోని విధంగా భారీ ఎత్తున పలు రకాల బహుమతులను పంపించాడు. దీంతో ఆమె అత్త వారింటి కుటుంబ సభ్యులు ఆ బహుమతులను చూసి షాకయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి తన కుమార్తె ప్రత్యూషకు ఇటీవలే వివాహం జరిపించాడు. పుదుచ్చేరిలోని యానాంకు చెందిన వ్యాపారవేత్త కుమారుడు పవన్ కుమార్ కు, ప్రత్యూషకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన తరువాత ఆమె యానాంకు మారింది. ఈ క్రమంలో ఆషాఢ మాసం సందర్భంగా బలరామకృష్ణ తన కుమార్తెకు భారీ ఎత్తున బహుమతులను పంపించాడు. అయితే అవన్నీ ఆహార పదార్థాలు కావడం విశేషం.
బలరామకృష్ణ వ్యాపారి. అనుకుంటే పెద్ద ఎత్తున రక రకాల గిఫ్ట్లను ఇవ్వవచ్చు. కానీ వెరైటీగా అతను ఆహార పదార్థాలను పంపించాడు. వాటిల్లో 1000 కిలోల చేపలు, 1000 కిలోల కూరగాయలు, 250 కిలోల రొయ్యలు, 250 కిలోల కిరాణ సరుకులు, 250 సీసాల పచ్చళ్లు, 250 కిలోల స్వీట్లు, 50 కోళ్లు, 10 మేకలు ఉన్నాయి. వాటిని ట్రక్కుల్లో లోడ్ ద్వారా యానాంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి పంపించాడు. దీంతో ఆ లోడ్లను చూసి ఆమె అత్త వారింటి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ వార్త అక్కడ అందరికీ తెలిసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.