Trisha : చెన్నై చంద్రం త్రిష నాలుగు పదుల వయస్సులోనూ తెగ సందడి చేస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో నానా హంగామా చేస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే మోహన్లాల్ హీరోగా నటిస్తోన్న ‘రామ్’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. మరోవైపు డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇతర భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ను అనువదించనున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది.
తాజాగా త్రిషకి అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్గా నిలిచారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది త్రిష. ఇక ఇప్పటికే ఈ వీసాను.. ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్.. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ చిత్ర వంటి వారు అందుకున్నారు.
తమిళ చిత్రపరిశ్రమ నుంచి ఈ వీసా అందుకున్న తొలి నటి త్రిష. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.