Tollywood : సినీ పరిశ్రమ పెద్దలు కొన్ని నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు నేటి నుండి ఏపీలోని థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సినీ పరిశ్రమకు కాస్త ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో సినీ పెద్దలు చర్చలు జరపగా, ఎట్టకేలకు దీనిపై సానుకూల స్పందన వచ్చింది.
కొత్త సినిమాలు విడుదల చేస్తే.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ శాతం తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఆందోళన చెందిన సినీ ఇండస్ట్రీకి జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మహా సముద్రం చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన చిత్ర బృందానికి ఆనందం కలిగిస్తోంది. దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తాజా ఆదేశాల్లో తెలిపింది. దీంతో సెకండ్ షో సినిమాకు కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు.