Tollywood : ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌజ్లో ఒకటిగా ఉంది మైత్రి మూవీ మేకర్స్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్న ఈ నిర్మాణ సంస్థ అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని రెండు పార్ట్స్గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. అంటే ఈ సినిమా మరో నెల రోజులలో విడుదల కానుంది.
ఇప్పటి వరకు చిత్రం నుండి దాక్కో దాక్కో మేక, చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే, సామీ సామీ సాంగ్ లను రిలీజ్ చేశారు. ఈ పాటలు శ్రోతలను అలరించాయి. అయితే రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇంత వరకు టీజర్ ను విడుదల చేయలేదు, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ లేదు, సినిమా నుండి వరుస లీకులు వస్తున్నాయి, ప్రమోషన్స్ సరిగా లేవు.. వీటన్నింటిని చూసి విసిగిపోయిన నెటిజన్స్ సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నిప్పులు చెరుగుతున్నారు.
#UnworthyProductionMythri అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ ట్రెండ్ చేయగా, ఇప్పుడు ఇది ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికైనా మైత్రి మూవీ మేకర్స్ మేల్కొని త్వరగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని అంటున్నారు. కాగా, పుష్ప సినిమా హిందీ థియేట్రికల్ రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా, ఈ విషయం మీద రకరకాల కథనాలు ప్రచారం జరుగుతుండగా అల్లు అర్జున్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.