కరోనా మహమ్మారి ఎన్నో బంధాలను విడదీసి ఎన్నో కుటుంబాలలో తీవ్ర అలజడి సృష్టించింది. ఎంతోమంది తమ ప్రాణానికి ప్రాణమైన ఆప్తులను కోల్పోయి జీవచ్చవంలా బతుకుతున్నారు. మరికొందరు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా వీధిన పడ్డారు. ఇటువంటి ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో కలలు కంది. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తున్న టువంటి వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవాలనే కలలు కనింది.మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి జీవితంలోకి అడుగు పెట్టబోతునాన్న సంతోషంలో ఉండగానే తన జీవితంలోకి కరోనా మహమ్మారి దాపురించింది.
కరోనా బారిన పడ్డ ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువతిని ప్రేమించిన యువకుడు తనకు ఎంతో ధైర్యం నూరిపోశారు. నీకు ఏమి కాదు నువ్వు ధైర్యంగా బయటికి వస్తావు మనం కలలుగన్న ప్రపంచంలో బతుకుదామని భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై కి మార్చారు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు డాక్టర్ల తో మాట్లాడి ఏకంగా ఐసీయూలో కి వెళ్లి ఆ యువతికి ధైర్యం చెప్పాడు. తాళిని తీసుకుని వెళ్లి ఆస్పత్రి బెడ్ పైనే తాళి కట్టి ఇప్పటినుంచి నువ్వు నా భార్యవి.. నేను నీ భర్తను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాం అని భరోసా ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువు చేతిలో ఓడిపోయింది. మరణించిన యువతి అంత్యక్రియల భర్త హోదాలో ఆ యువకుడు ఆమె సోదరుడు నిర్వహించారు. అయితే తాను మరణించినట్లు ఇప్పటివరకు ఇంట్లో వారికి తెలియదు. ఆ బాధను తనలోనే దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.