తన శరీరంలోని చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దళితుల కోసం పోరాటం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం విదితమే. కాగా ఈ పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడ్డామని అన్నారు. అదేవిధంగా దళిత బంధు కోసం కూడా పోరాటం చేస్తామని అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. తన శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ పథకం కోసం, దళితుల అభివృద్ధి కోసం పోరాడుతానని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా దళితల జాతి పేదరికంలో మగ్గిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు సభ్య సమాజమే కారణమన్నారు. దళితులు సామాజిక వివక్షకు గురవుతున్నారని తెలిపారు. దళితుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని విడనాడాలని అన్నారు. వారు అన్ని రంగాల్లోనూ ఎదగాలని, అందుకు గాను సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.