Sonu Sood : కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పేదలకు అనేకమైన సేవలు చేసిన సోనూసూద్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆయన అభిమానులందరూ కోరుతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన చెల్లెలిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. నా సోదరి మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది.. అని సోనూసూద్ అన్నారు.
రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం” అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్ ప్రకటించారు.
ఏ పార్టీలో చేరాలన్నది ఐడియాలజీని బట్టి ఉంటుంది. పలు పార్టీల నేతలు ఎంతో మందితో క్యాజువల్ మీటింగ్స్ జరుగుతున్నప్పటికీ, సిద్ధాంతాలే ముఖ్యమన్నది.. మా కుటుంబం నమ్ముతోంది’ అని సోనూ సూద్ వ్యాఖ్యానించారు.
తన పొలిటికల్ ఎంట్రీపైనా నటుడు సోనూ సూద్ క్లారిటీ ఇచ్చారు. తన తరహాలో పనిచేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చే ఏ వేదికలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నానని, అది రాజకీయ వేదికైనా కావొచ్చు, లేదా రాజకీయాలతో సంబంధం లేని వేదికైనా కావొచ్చు అని సోనూ సూద్ చెప్పారు.
సోనూ మాటలని బట్టి చూస్తుంటే త్వరలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను, పంజాబ్ సీఎం చన్నిని కలిసిన సోనూ సూద్, త్వరలో అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను కూడా కలవబోతున్నట్లు తెలిపారు.