ఉత్తరప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డును ప్రారంభిద్దామని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టగానే ఆ రోడ్డు పగిలిపోయింది. దీంతో అందరూ ఖంగు తిన్నారు. ఈ సంఘటన అక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
బిజ్ నోర్ సదర్ అనే ప్రాంతంలోని హల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖేడా అజీజ్పుర అనే గ్రామంలో రూ.1.16 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించ తలపెట్టారు. అందులో భాగంగా 7.50 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాల్సి ఉంది. దాంట్లో 700 మీటర్ల మేర కొంత భాగంలో రోడ్డును నిర్మించారు. ఈ క్రమంలో ఆ రోడ్డును ప్రారంభించేందుకు అక్కడి ఎమ్మెల్యే సుచి చౌదరి హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ఆమె కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించారు. అయితే కొబ్బరికాయ కొట్టగానే కొంత సేపటికి రోడ్డులో పగుళ్లు వచ్చాయి. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై ఆమె ఫైరయ్యారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడి కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. అధికారులు విచారణ చేపట్టారు.
పూర్తి నాణ్యతా లోపంతో రోడ్డును నిర్మించారని, అందుకనే రోడ్డుకు బీటలు వచ్చాయని తేల్చారు. దీంతో రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్తోపాటు సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.