Puneeth Rajkumar : శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో యావత్ సినీ ప్రపంచమే తీవ్ర శోకంలో మునిగింది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి ఆసరా కల్పించారు. పునీత్ రాజ్ కుమార్ సేవ అంతులేనిది. ఎంతో మంది సెలెబ్రిటీలు బెంగుళూరు వెళ్ళి ఆయనకు సంతాపం తెలిపి.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి వచ్చారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో విశాల్ లేటెస్ట్ గా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ గురించి, ఆయన విశేషమైన సేవల గురించి విశాల్ తెలిపి ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను చూడలేదని, ఆయన లేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆయన రూపం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉందని అన్నారు. విశాల్ నటించిన ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పునీత్ కు విశాలం నివాళులు అర్పించారు. విశాల్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ మరణం అనేది సినీ పరిశ్రమకు మాత్రమే కాదు.. సమాజానికి కూడా తీరని లోటు. మేకప్ ఉన్నా.. తీసేసినా.. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతారు.
అలాగే పునీత్ ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు.. వృద్ధాశ్రమాల్ని నడిపిస్తున్నారు. ఇవన్నీ ఒక్క మనిషి చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అలాగే పునీత్ ఇప్పటివరకు చదివించిన 1800 మంది చిన్నారుల్ని తన స్నేహితుడిగా తాను చదివిస్తానని పునీత్ కు మాటిస్తున్నానని అన్నారు. ఈ మాటతో ప్రీ రిలీజ్ ఈవెంట్ షో మార్మోగిపోయింది. ఒక స్నేహితుడిగా నిజమైన నివాళిని అందించిన విశాల్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏదో రెండు మాటలతో సరిపెట్టుకోకుండా.. పునీత్ బాధ్యతను తీసుకున్న విశాల్ నిజమైన స్నేహితుడని అనిపించుకున్నారు.