Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూయడం అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది. కర్ణాటక వ్యాప్తంగా ఆయన అభిమానులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతున్నది. పునీత్ లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చామరాజనగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే అభిమాని.. పునీత్ మరణవార్తలను టీవీలో చూస్తూ ఒక్కసారే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉడుపి జిల్లాలో సతీశ్ అనే రిక్షా పుల్లర్ తన అభిమాన హీరో చిత్రపటానికి పూలమాలవేసి రిక్షాలోనే కుప్పకూలిపోగా, అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రాయచూర్ జిల్లాలో బసవ గౌడ్, మహ్మద్ రఫీ అనే మరో ఇద్దరు పునీత్ అభిమానులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఇక పునీత్ని ఎంతగానో అభిమానించే ఓ అభిమాన యాంకర్ లైవ్లో ఆయన మరణ వార్త చదువుతూ కన్నీరు పెట్టుకుంది. ఆయన మరణ వార్తను చదువుతూ బోరున ఏడ్చేసింది. తోటి సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చే వరకు ఏడుస్తూనే ఉంది. అనంతరం బాధను దిగమింగుతూ న్యూస్ చదివింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పునీత్ మరణం తర్వాత ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి.