Nara Rohith : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు తనపై తన సతీమణి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు విలపించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర దూమారం రేపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో భోరున విలపించారు. ఇక ఈ ఘటనపై పలువురు సినీ హీరోలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఈఘటనపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నటుడు నారా రోహిత్ స్పందించారు. అధికారంలో ఉన్న కొందరు నేతలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సభలో అధికార పక్షం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని రోహిత్ అన్నారు. శిశుపాలుడి మాదిరిగానే వైసీపీ నాయకుల 100 తప్పులు పూర్తయ్యాయని, ఇక తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ దుశ్శాసనుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని, స్థాయి లేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న.. అంటూ నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.