Nagarjuna : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో ఈ విషయంలో హీట్ మరింత పెరిగింది. దీంతో ఆయనకు, ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. అయితే ఎట్టకేలకు వర్మ ఈ తగవుకు ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నానని.. ఇలా మాటల యుద్ధం కొనసాగిస్తే ఒరిగేది ఏమీ ఉండదని.. కనుక ఇకపై తాను ఈ గొడవపై మాట్లాడబోనని తెలిపారు.
అయితే తాజాగా బంగార్రాజు మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జునకు ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై స్పందించాలని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా తన సినిమాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై ఇంతకన్నా మించి మాట్లాడడం సరికాదన్నారు.
కాగా సినిమా టిక్కెట్ల రేట్లపై ఫిబ్రవరి 10 లోపు సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర వివరాలను సేకరిస్తోంది. పూర్తి నివేదికను త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో కోర్టు తుది తీర్పు ఏమని ఇస్తుందా..? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.