ఏ మాయ చేశావే సినిమాలో జంటగా నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తాజాగా అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా నాగచైతన్య తన చేతిపై ఉన్న టాటూపై స్పందించాడు. ఆ టాటూ సమంతకి సంబంధించింది. వారి పెళ్లి రోజున నాగ చైతన్య చేతిపై టాటూగా వేయించుకున్నాడు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఆ టాటూ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ టాటూని తొలగిస్తారా అని ప్రశ్నించగా.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని నాగచైతన్య తెలిపాడు. తమ వెడ్డింగ్ డేట్ ని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఓ సలహా ఇచ్చారు. కీలకమైన పర్సనల్ డీటెయిల్స్ ని టాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టాటూల జోలికి వెళ్ళొద్దని తెలిపాడు.
సమంత కూడా తన బాడీపై నాగ చైతన్యకి సంబంధించిన టాటూ వేయించుకుంది. ఇటీవల సామ్ కూడా.. జీవితంలో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది. విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంతో నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతూ నటిస్తున్నాడు. తర్వాత సర్కారు వారి పాట ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఒక చిత్రానికి చైతూ కమిట్ అయ్యాడు.