సాధారణంగా మనుషులకు ప్రతీకారాలు ఉంటాయి. తమ వాళ్లను చంపితే కొందరు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి తమ వాళ్లను చంపిన వారి చంపి ప్రతీకారం తీర్చుకుంటారు. అయితే అక్కడ కోతులు ఈవిధంగా చేస్తున్నాయి. అవి ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. ఏంటీ.. నమ్మబుద్ది కావడం లేదా..? అయితే ఏం జరిగిందో తెలుసుకుందాం.. పదండి..!
మహారాష్ట్రలోని బీడ్ అనే జిల్లాలో ఉన్న మజల్గావ్ అనే గ్రామంలో 3 నెలల కిందట కొన్ని వీధి కుక్కలు ఓ చిన్న కోతిపిల్లను చంపేశాయి. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన కోతులు ఓ సమూహంగా ఏర్పడి బీడ్లో ఉన్న అనేక గ్రామాల్లో కుక్క పిల్లలను చంపడం మొదలు పెట్టాయి.
అలా ఈ 3 నెలల కాలంలో కోతులు ఏకంగా 80 కుక్క పిల్లలను చంపేశాయి. గ్రామాల్లో ముందుగా అవి కుక్క పిల్లల కోసం వెదుకుతాయి. అవి కనబడగానే వెంటనే వాటిని తీసుకుని ఎత్తయిన ప్రదేశానికి లేదా ఎత్తయిన చెట్ల మీదకు వెళ్తాయి. అక్కడి నుంచి ఆ కోతులు ఆ కుక్క పిల్లలను కిందకు పడేసి చంపేస్తాయి. ఇలా 80 కుక్క పిల్లలను కోతులు ఇప్పటి వరకు చంపేశాయి.
కోతులు ఇలా చేస్తుండడంతో అక్కడి లవూల్, మజల్గావ్ గ్రామాల్లో ఇప్పుడు చూద్దామంటే ఒక్క కుక్క పిల్ల కూడా కనిపించడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే కథ అంతటితో ముగియలేదు. ఆ కోతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రామస్థులను, మరీ ముఖ్యంగా చిన్నారులను టార్గెట్గా చేసి వారిపై దాడులు చేస్తున్నాయి. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే స్పందించి ఇప్పటికే చాలా వరకు కోతులను పట్టుకున్నారు. అప్పట్లో ఓ కోతిపిల్లను కుక్కలు చంపినందుకే కోతులు ఇలా రెచ్చిపోయి ప్రతీకారం తీర్చుకుంటున్నాయని గ్రామస్థులు అంటున్నారు.