Minister Anil Kumar Yadav : తెలంగాణలో తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ఏపీలోనూ తమ పార్టీ పెట్టాలని ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే ఆ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. ఏపీలోనూ తెరాస పార్టీ పెట్టాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో కరెంటు సమస్య లేదని అన్నారు. ఏపీలో పార్టీ పెడితే చాలు, గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏపీలోనూ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకనే తెరాసను వారు ఆహ్వానిస్తున్నారని అన్నారు.
అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఏపీలో కరెంటు కొరత సమస్య లేదని, కేవలం బొగ్గు కొరత మాత్రమే ఉందని, ఇది దేశమంతటా ఉందన్నారు. నిజానికి తెలంగాణ కన్నా ఏపీలోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ కావలిస్తే ఏపీలో తమ పార్టీ పెట్టుకోవచ్చని.. దాన్ని అడ్డుకోబోమని.. స్వాగతిస్తామని తెలిపారు.