Manoj : కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇన్నాళ్లూ డెల్టా వేరియెంట్ గుబులు పుట్టించగా, ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా సినీ సెలబ్రిటీలను వైరస్ వణికిస్తోంది. రీసెంట్ గా కమెడియన్ వడివేలు కరోనాతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఒమిక్రాన్ వచ్చిందంటూ.. రూమర్స్ కూడా వినిపించాయి. అటు కమల్ హాసన్ తోపాటు తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా కరోనా బారిన పడి రీసెంట్ గానే కోలుకున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, నర్సులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని మనోజ్ ట్వీట్ చేశాడు.
గతంలో సినీ సెలబ్స్ చాలా మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో.. ఒమిక్రాన్ భయం, థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల నేపథ్యంలో.. స్టార్టింగ్ స్టేజ్ లోనే కోవిడ్ బారిన పడ్డారు మంచు మనోజ్. టాలీవుడ్ లో ఈ మధ్యలో సెలెబ్రిటీలు ఎవరూ కోవిడ్ బారిన పడలేదు. కానీ ఇప్పుడు మనోజ్ కి కరోనా పాజిటివ్ రావడం అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది.