Maa Elections : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఈరోజు ఉదయం నుండి మొదలైన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి కేవలం మా అసోసియేషన్ మెంబర్స్ కే కాకుండా ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఎందుకంటే ఇంతకుముందెన్నడూ లేని రీతిలో మా ఎలక్షన్స్ ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా పోటీదారులు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఈ ఎన్నికలపై మరింత హీట్ ను పెంచాయి.
ఈ క్రమంలో ఎలక్షన్ టైమ్ లో ఒక ప్యానెల్ సభ్యులు మరో ప్యానెల్ మెంబర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఒక్కటేనని విష్ణు, ప్రకాష్ రాజ్ లు చెప్పారు. కానీ వీరిద్దరి గ్రూప్ ల మధ్య కోల్డ్ వార్ మాత్రం సాగుతూనే ఉంది. ఎలక్షన్ కి ముందే పోలింగ్ టైమ్ లో మాటలు వదులుతూ విమర్శలు చేసుకున్నారు. ఇక మోహన్ బాబు సైతం ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మండి పడ్డారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేశారని, మా సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు పోలింగ్ లోపలికి ఎలా వస్తారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్యానెల్ లో ఉన్న శివ బాలాజీ, ప్రకాష్ రాజ్ టీమ్ లో హేమల మధ్య గొడవ జరిగింది.
హేమ.. శివబాలాజీ చేయి కొరికిందంటూ నరేష్ మీడియాకు తెలిపారు. శివ బాలాజీని కొరికేసిందంటూ కొరికిన చేతిని మీడియాకు చూపించారు. దీనిపై స్పందించిన హేమ.. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తర్వాతా క్లారిటీగా మాట్లాడతానని పేర్కొంది. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. తాను ఏమీ అనలేదని, వీడియోలు చూసుకోమ్మని కోరాడు.