శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు తన కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పదవీ వ్యామోహంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో ఏమీ జరగకున్నా.. చంద్రబాబునాయుడు కావాలనే ప్రజల సింపతీ కోసం ఇలా తన భార్య పేరును అడ్డుపెట్టుకుని నాటకం ఆడుతున్నాడని, పదవీ వ్యామోహంతోనే మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడి దొంగ ఏడుపులను కుటుంబ సభ్యులు నమ్మవద్దని హెచ్చరించారు.
ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ కడుపున పుట్టిన గొప్ప మనస్సు ఉన్న వ్యక్తి బాలకృష్ణ అని.. కానీ చంద్రబాబు చేసిన మోసాన్ని హెచ్చరించినా.. బాలకృష్ణ పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబు పదవీ వ్యామోహం కోసమే దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని.. ఆయన నటన ఆస్కార్ను మించిపోయిందని ధ్వజమెత్తారు. ఆయన దొంగ ఏడుపులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
చంద్రబాబు ఒక నీచుడు, నికృష్టుడు అని లక్ష్మీ పార్వతి అన్నారు. మహిళలను కించపరిచి వాడుకుంటున్నది చంద్రబాబే. లబ్ది కోసం ఎలాంటి పనైనా చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు. అధికార పిచ్చి పట్టిన మృగం. గతంలో వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు నీచ ప్రచారం చేశాడు. నేరుగా ప్రజల్లో గెలవలేక బురద జల్లడంలో చంద్రబాబు ఘనుడు.. అని లక్ష్మీ పార్వతి అన్నారు.