JioPhone Next : టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. ఈ ఏడాది జూన్లోనే జియోఫోన్ నెక్ట్స్ పేరిట అత్యంత చవక ధరకు ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను అందిస్తామని ప్రకటన చేసింది. గూగుల్తో కలిసి ఆ ఫోన్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది. అయితే షెడ్యూల్ ప్రకారం జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ను సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చిప్ల కొరత కారణంగా ఈ ఫోన్ విడుదల దీపావళికి వాయిదా పడింది.
ఈ క్రమంలోనే జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ను దీపావళికి లాంచ్ చేయనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. అయితే ఈ ఫోన్లో అందించనున్న ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి జియో ప్రకటించింది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రగతి ఓఎస్ను ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించారు. కేవలం జియోఫోన్ నెక్ట్స్ కోసం మాత్రమే ఈ ఓఎస్ను గూగుల్ తీర్చిదిద్దింది.
ప్రగతి ఓఎస్ భారతీయులకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్ అలౌడ్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఏఆర్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక జియో, గూగుల్ యాప్స్ను ఇన్బిల్ట్గా అందిస్తారు.
జియోఫోన్ నెక్ట్స్ ఫోన్లో 5.5 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (క్వాల్ కామ్ 215 చిప్సెట్), డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు.. వంటి ఫీచర్లను అందివ్వనున్నారని ఇదివరకే లీక్ల ద్వారా తెలిసింది. ఈ ఫోన్ను రూ.3,300 కే అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ను ఏపీలోని తిరుపతిలో, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో నియోలింక్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అయితే దీపావళి రోజున అయినా ఈ ఫోన్ను లాంచ్ చేస్తారా ? ఏమైనా ఆటంకాలు వస్తాయా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.