Jio : ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తోపాటు ఆ సంస్థకు చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల సేవలు మొన్న కొన్ని గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే సమస్య జియోకు ఎదురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని గంటలుగా దేశంలోని పలు చోట్ల జియో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు.
డౌన్ డిటెక్టర్ అనే సంస్థకు జియో పనిచేయడం లేదని కొన్ని గంటలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంత మంది జియో వినియోగదారులకు సమస్యలు వస్తున్నాయో తెలియదు కానీ ఈ సమస్య కేవలం కొంత మందికే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు దేశంలో కొన్ని చోట్ల 4వేల మందికి పైగా వినియోగదారులు తమకు జియో నెట్ వర్క్ సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదు చేయగా.. జియో కస్టమర్ కేర్కు కూడా పెద్ద ఎత్తున కస్టమర్లు ఫోన్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన జియో ఈ సమస్య తాత్కాలికమేనని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది.