Diwali Gifts : సాధారణంగా ఏ వ్యాపార సంస్థ యజమాని అయినా పండుగ సీజన్ వస్తుందంటే కస్టమర్లను ఆకర్షించడానికి కానుకలు, ఉచితాలు వంటి ఆఫర్లు ప్రకటిస్తారు. అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తూ అధిక ఆదాయం పొందాలని చూస్తారు. కానీ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఓ నగల షోరూం యజమాని అందరు బిజినెస్మెన్లా కాకుండా ఉద్యోగస్తుల పక్షపాతిగా మారారు. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో సంబరపడిపోయారు.
చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ చయంతి తన సిబ్బందిని ఈ సంవత్సరం భారీ బహుమతులతో ఆశ్చర్యపరిచారు. దీపావళి కానుకగా రూ. 1.2 కోట్ల విలువైన కార్లు మరియు బైక్లను ఇచ్చారు. అతను 10 కార్లు మరియు 20 బైక్లను బహుమతిగా ఇచ్చారు. దీనితో సిబ్బంది ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ.. తన సిబ్బంది మరింత పని చేయడానికి. వారి జీవితంలో ప్రత్యేకత ఉండటానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. వారు వ్యాపారంలో హెచ్చు తగ్గుల సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని ఆయన తెలిపారు.

లాభాలు సంపాదించడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు. వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదు. వారు నా కుటుంబం. కాబట్టి వారికి అలాంటి సర్ ప్రైజ్లు ఇచ్చి వారిని నా కుటుంబ సభ్యుల్లాగే చూడాలనుకున్నాను. కానుకలు ఇచ్చిన తరువాత నేను మరింత సంతోషంగా ఉన్నాను. ప్రతీ యజమాని వారి సిబ్బందిని, సహోద్యోగులకు బహుమతులు ఇచ్చి గౌరవించాలి అని ఆయన తెలిపారు. కాగా.. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24 సోమవారం జరుపుకోనున్నారు.