Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా ముద్ర పడినప్పటికీ జాన్వీ కపూర్ నటనలో మంచి మార్కులే కొట్టేసింది. ఈమె నటించిన పలు బాలీవుడ్ మూవీలు మరీ బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేదు. అయినప్పటికీ ఒక మోస్తరుగా టాక్ సాధించాయి. దీంతో జాన్వీ కపూర్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ భారీ స్థాయిలో హిట్ కోసం ఈమె ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండలు ప్రస్తుతం లైగర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
అయితే లైగర్ మూవీలో మొదట జాన్వీ కపూర్నే అనుకున్నారట. కానీ ఆమెకు కాల్ షీట్స్ సర్దుబాటు కాలేదట. ఆమె బాలీవుడ్లో పలు ఇతర మూవీలతో బిజీగా ఉంది. అందువల్ల ఆమె లైగర్ మూవీ చేయలేకపోయింది. దీంతో అనన్య పాండేను ఆ అవకాశం వరించింది.
అయితే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబోలో ఇంకో మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. లైగర్ మూవీతో ఈ ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. దీంతో వీరిద్దరూ ఇంకో మూవీని చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ మూవీ ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక అందులో నటించాల్సిందిగా పూరీ.. జాన్వీని ఒప్పించారట. ఇందుకు జాన్వీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే జాన్వీ నటించే తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
ఇక జాన్వీ కపూర్ను కూడా తెలుగు తెరకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ఆమె తండ్రి బోనీ కపూర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.