IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్2022 ఎడిషన్ లో గత రెండు మూడు రోజుల నుంచి జోరు కొద్దిగా పెరిగిందనే చెప్పవచ్చు. ప్రధాన టీమ్లు ఓడిపోతుండడం.. కొత్త జట్లు గెలుస్తుండడంతోపాటు.. గత సీజన్లలో చెత్త ప్రదర్శన ఇచ్చిన జట్లు కొన్ని ఈసారి చుక్కలు చూపిస్తుండడంతో.. ఐపీఎల్ 2022 ఆసక్తికరంగా మారింది. ఇక ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా పంజాబ్ జట్టు బ్యాట్స్మన్ లియామ్ లివింగ్ స్టోన్ తాజా మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతను కొట్టిన ఓ భారీ సిక్సర్ ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది.
చెన్నైతో జరిగిన మ్యాచ్లో లివింగ్ స్టోన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్తోనూ రాణించి తమ జట్టు పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లో లివింగ్ స్టోన్ 5వ ఓవర్లో చెన్నై బౌలర్ ముకేష్ చౌదరి వేసిన తొలి బంతినే భారీ సిక్సర్ రూపంలో మలిచాడు. ఆ సిక్స్ ఏకంగా 108 మీటర్ల దూరం వెళ్లినట్లు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు ఈ సీజన్లో కొట్టిన భారీ సిక్సర్గా రికార్డు సృష్టించింది. అంతకు ముందు ముంబైతో మ్యాచ్లో రాజస్థాన్ బ్యాట్స్మన్ జాస్ బట్లర్ 104 మీటర్ల దూరం సిక్స్ కొట్టాడు. ఇప్పుడు లివింగ్ స్టోన్ కొట్టిన సిక్స్ ఏకంగా 108 మీటర్ల దూరం నమోదు కావడం విశేషం.
Mukesh Choudhary to Livingstone, SIX, ???? masssiveeee!#CricketMasterUpdater pic.twitter.com/GevVxnUnRW
— Live Cricket Master Updater (@MohsinM55415496) April 3, 2022
ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. తరువాత బ్యాటింగ్ చేసిన చెన్నై 18 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. కేవలం 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా చెన్నై జట్టు ఈ సీజన్లో ఇంకా ఖాతా తెరవలేదు. ఇది ఆ జట్టుకు వరుసగా మూడో పరాజయం. ఈ క్రమంలోనే చెన్నై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్కు ధోనీ కెప్టెన్గా తప్పుకోగా.. అతని స్థానంలో రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం విదితమే.